Total Pageviews

Sunday, September 7, 2014

శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

మరణకాలమున మనస్సునందున్న కోరికగాని యాలోచనగాని వాని భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5, 6 శ్లోకములలో శ్రీకృష్ణు డిట్లు చెప్పియున్నాడు. "ఎవరయితే వారి యంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో, వారు దానినే పొందెదరు." అంత్యకాలమందు మనము మంచి యాలోచనలే మనస్సునందుంచుకొన గలమని నిశ్చయము లేదు. అనేకమంది అనేక కారణములవల్ల భయపడి యదరి పోయెదరు. కావున అంత్యసమయమందు మనస్సును నిలకడగా నేదో మంచియోలోచనయందే నిలుపవలె నన్నచో నిత్యము దాని నభ్యసించు టవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందుంచుకొని యెల్లప్పుడు భగవన్నామస్మరణ చేసినచో, మరణకాలమందు గాబరా పడకుండ ఉండగలమని యోగీశ్వరులందరు మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్యశరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి, యంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని యిచ్చట చెప్పెదము. ఎవరయితే ఈ ప్రకారముగ జేసి హరియొక్క పాదములను శరణు వేడెదరో, వారు సకలకష్టములనుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే ప్రేమభక్తులతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో, వారికి దేవుడు పరుగెత్తిపోయి, సహాయము చేయును. నీ పూర్వపుణ్య మెక్కువగుటచే నీ విక్కడకు రాగలిగితివి. నేను చెప్పినదానిని జాగ్రత్తగ విని, జీవిత పరమావధిని కాంచుము

హేమాడ్ పంతు సంసారమును, అశ్వత్థవృక్షముతో పోల్చుచు, గీతలో చెప్పిన ప్రకారము, దాని వ్రేళ్ళుమీదకు కొమ్మలు క్రిందకు గలవనెను. దాని కొమ్మలు క్రిందవైపు మీదివైపుగూడ వ్యాపించి యున్నవి; అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని యంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవప్రపంచమువరకు వ్యాపించి యున్నవి. దాని స్వరూపము గాని దాని యాధారముగాని, దాని యాద్యంతములు గాని ఈలోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళుగల అశ్వత్థవృక్షమును నరికి, ఏ యతీతమార్గము ననుసరించిన తిరిగి జన్మలేదో యట్టిదాని ననుసరించవలెను. 

అట్టి దారియందు నడచుటకు, దారి చూపు మంచిగురువు సహాయము మిక్కిలి యవసరము. ఒకడెంత పండితుడై నప్పటికిని వేదవేదాంగములను బాగుగ చదివినప్పటికిని, తన గమ్యస్థానమునకు సురక్షితముగ పోలేడు. మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో, మార్గములో నున్న గోతులనుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగ జేయు ఆహారము గాని, పౌష్టికశక్తి గాని లేనప్పుడు భగవంతుడి నేకండ్లతో చూడగలము? వేయేల మన యవయవము లన్నియు వాని శక్తిని అవి సంపాదించుకొన్నప్పుడు, అవి మంచిస్థితిలో నున్నప్పుడే, మనము భక్తిమొదలగు సాధనముల నాచరించి దేవుని చేర గలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనముగాని మంచిది గాదు. ఆహారములో మితి, శరీరమునకు మనస్సునకు కూడ మంచిది. మానవు డిచ్చినది త్వరలో సమసిపోవునుగాని, దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు "తీసికో, తీసికో" అనును కాని, ప్రతివాడు నావద్దకు వచ్చి 'తే,తే' యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువా డొక్కడును లేడు. నాసర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనము) నిండుగానున్నది. అది యంచువరకు నిండి పొంగిపోవుచున్నది. నేను "త్రవ్వి, ఈ ధనమును బండ్లతో తీసుకపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము నంతయు ఆచికొనవలెను." అనుచున్నాను. నా ఫకీరు చతురుత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిగుల యమోఘమైనవి. నా సంగతి యేమి? శరీరము మట్టిలో కలియును. ఊపిరి గాలిలో కలియును. ఇట్టి యవకాశము తిరిగి రాదు. నే నెక్కడికో పోయెదను; ఎక్కడనో కూర్చుండెదను; మాయ నన్ను మిగులబాధించుచున్నది. ఐనప్పటికి నావారికొరకు ఆతురపడెదను. ఎవరయిన నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరయితే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో, వారమూల్యమైన యానందమును పొందెదరు. 
"ఎవరయితే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాదపడరు. కనుక హాయిగ నుండుడు. కురుపుపై ఊదీని పూయుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరయితే యిందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు. వారి కష్టములు గట్టెక్కును."  "కర్మయొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను, నన్నే సర్వమునకు కారణ భూతునిగా నెంచెదరు. అది యదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్రహృదయులు. నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన యహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములూడి మోక్షమును పొందెదరు."

"నేను ఒక రూపాయి దక్షిణ యెవరివద్దనుంచి గాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరకనే యేమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియకుండగ నే నెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమయిపోవును. గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని, నీ విప్పు డనుభ వించలేవు. కనుక ధనమును పొందవలెననినచో. దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటయే సరియైన మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును." 

శ్రీ సాయిజీవితము మిగుల పావన మయినది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు వర్ణింప నలవికానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మాంనందముతో మైమరచెడివారు. మరికొన్ని సమయములం దాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడన్నిపనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడి వారు. ఒక్కొక్కప్పు డేమియు చేయనట్లు గన్పించినప్పటికిని వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడు వారు కారు. వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము చేసెడివారు. వారు సముద్రమువలె శాంతముతో తొణకక యుండినట్లు గనిపించినను వారి గాంభీర్యము, లోతు, కనుగొనరానివి. వర్ణనాతీతమయిన వారి నైజము వర్ణింపగలవా రెవ్వరు? పురుషులను అన్నదమ్ములవలె, స్త్రీల నక్కచెల్లెండ్రవలె తల్లులవలె చూచుకొనెడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అంద రెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచుగాక! ఎల్లప్పుడు హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవచేసెదము గాక. వారిని జీవకోటియందు జూచెదము గాక! వారి నామము నెల్లప్పుడు ప్రేమించెదము గాక. 

0 comments:

Post a Comment