Total Pageviews

Tuesday, February 5, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము నలుబదియేడవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియేడవ అధ్యాయము

బాబాగారి స్మృతులు

వీరభద్రప్ప, చెన్నబసప్ప (పాము - కప్ప) కథ

గత అధ్యాయములో రెండు మేకల పూర్వవృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడ అట్టి పూర్వవృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు, చెన్న బసప్ప యొక్కయు కథలు చెప్పుదుము.

తొలిపలుకు

శ్రీసాయి ముఖము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో, గత యెన్నో జన్మల విచారమును నశింపజేసి యెంతో పుణ్యము ప్రాప్తించినటుల జేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో, మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనమానందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును. అట్టి పావనమైన నది కూడ యోగు లెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో ప్రోగైన పాపములన్నిటిని వారి పాదధూళిచే పోగెట్టదరాయని యాతురుతతో జూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొనిపోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీసాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారినుండి వినుడు.

సర్పము, కప్ప

సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడంగెను. "ఒకనాడుదయము ఉపాహారము ముగించిన తరువాత వాహ్యాళికి పోయి యొక చిన్న నది యొడ్డున చేరితిని. అలసిపోవుటచే నచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి, హాయిగా కూర్చుని యుంటిని. అచట చెట్లనీడలున్న కాలిత్రోవ బండిత్రోవలు రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప యొకటి బెక బెక లాడుట వింటిని. చెకుముకిరాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చినాప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నా కందజేసెను. కప్ప బెక బెక మనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలిసికొన గోరెను. ఒక కప్ప తన పూర్వ జన్మపాపఫలముననుభవించుచున్నదని చెప్పితిని. గతజన్మలో చేసినదాని ఫలము నీ జన్మలో ననుభవించి తీరవలయును. దానినిగూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును బీల్చి నాకందజేసి, తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి యరచుచుండెననియు గతజన్మలో రెండును దుర్మార్గులేగాన, ఈ జన్మయందు గతజన్మయొక్క పాపము నీశరీరములతో ననుభవించు చున్నవనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్దపాము ఒక కప్పను నోటితో బట్టుకొని యుండుట చూచెను. అతడు నావద్దకు వచ్చి 10, 12 నిముషములలో పాము కప్పనుమ్రింగునని చెప్పెను. నేనిట్లంటిని. "లేదు. అట్లు జరుగనేరదు. నేనే దాని తండ్రిని (రక్షకుడను). నేనిచటనే యున్నాను. పాముచేత కప్ప నెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే యున్నానా? దాని నెట్లు విడిపించెదనో చూడు." చిలుము పీల్చిన పిమ్మట, మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్నుకూడదగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీదపడి కరచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు బోయి యిట్లంటిని. "ఓ వీరభద్రప్పా! నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా? నీవు సర్పజన్మ మెత్తినప్పటికిని వాని యందు శత్రుత్వము వహించి యున్నావా? ఛీ, సిగ్గు లేదా! మీ ద్వేషములను విడచి శాంతింపుడు."

ఈ మాటలు విని, యాసర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యెను. కప్పకూడ గంతువేసి చెట్లపొదలలో దాగెను. 

బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్నమాటలకు పాము కప్పనెట్లు వదలి యదృశ్యమయ్యెను? వీరభద్రప్ప యెవరు? చెన్నబసప్ప యెవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి? అని యతడు ప్రశ్నించగా, నతనితో కలసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి, వృత్తాంత మంతయు నీరీతిగా బోధించితిని.

"మాయూరికి 4, 5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతబడి శిథిలమయ్యెను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనమును ప్రోగుచేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట, పూజకొరకు తగిన యేర్పాటులు చేసిరి. మరామతు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై బెట్టిరి. వాడు పరమలోభి; దేవాలయము బాగు చేయుటకు చాల తక్కువ వ్యయము చేసెను. దేవాలయములో నేమి యభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చుపెట్టెను. కొంత తాను మ్రింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండుటకేవో కారణములు చెప్పెడివాడు. గ్రామస్థులు తిరిగి వానివద్దకు బోయి అతడు సొంతముగా తగిన ధనసహాయము చేయనియెడల మందిరము వృద్ధికాదని చెప్పిరి. వారి అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలుచేసి యాతని కిచ్చిరి. వాడాధనమును పుచ్చుకొని, పూర్వము వలెనే యూరక కూర్చుండెను. కొన్నాళ్ళపిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో గనిపించి యిట్లు చెప్పెను. "నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను." ఆమె యీ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో యని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు, దానిని నమ్మనవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో గనపడి యేల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గరగా లేకుండెనా యనియు, ఇది దుస్స్వప్నమువలె గనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించునటుల తోచుచున్నదనియు అతడు సమాధానముచెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసివచ్చెను.

దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోను, ప్రేమతోను, మన్ననతోను ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకయిన దైవమిష్టపడును. కొన్ని దినముల పిమ్మట, దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి యిట్లనెను. "భర్త దగ్గరనున్న చందాలగూర్చి చీకాకు చెంద నవసరములేదు. దేవాలయము నిమిత్తమేమైన వ్యయము చేయుమని యాతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి, మరియు సద్భావము, కాబట్టి నీ కిష్టమున్న సొంతము దేదైన ఇవ్వవలెను." ఆమె తన భర్తతో సంప్రదించి తనతండ్రి తన కిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి యా సంగతి విని, చీకాకు చెంది, భగవంతునికూడ మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలనెంతో తక్కువ ధరకట్టి 1000 రుపాయలకు తానే కొని, నగదునకు బదులుగా నొకపొలము దేవాదాయముగా నిచ్చెను. అందులకు భార్యసమ్మతించెను. ఆ పొలము వాని సొంతము గాదు. అదియొక పేదరాలగు డుబ్కీయను నామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి యుండెను. ఆమె దానిని తీర్చలేక పోయెను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును కూడ అందరిని మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేదు, దాని విలువ చాల తక్కువ, దానివలన ఆదాయమేమియు లేదు.

ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి యధీనములో నుంచిరి. అందుల కతడు సంతసించెను. కొన్నాళ్ళకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను, కుంభవృష్టి కురిసెను. లోభి యింటికి పిడుగు పాటు తగిలి వాడు, వాని భార్య చనిపొయిరి. డుబ్కీ కాలగతి చెందెను.

తరువాత జన్మలో ఆ లోభి మధురాపట్టణములో నొక బ్రాహ్మణకుటుంబములో పుట్టి వీరభద్రప్పయను పేరనుండెను. అతని భార్య పూజారి కొమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి యని పేరు పెట్టిరి. డుబ్కీ మందిరపు గొరవ యింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్న బసప్ప యని నామ మిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరుచుగా వచ్చుచుండెను. నావద్ద కూర్చుండి మాట్లడుచు చిలుము పీల్చెడివాడు. అతని కొమార్తె గౌరి కూడ నా భక్తురాలు. ఆమే త్వరగా నెదుగు చుండెను. ఆమె తండ్రి వరునికై వెదకుచుండెను. ఆ విషయమై చీకాకు పడనవసరము లేదనియు, నామె భర్త తానై వెదకుకొని వచ్చుననియు నేను చెప్పితిని. కొన్నాళ్ళకు వీరభద్రప్పయను ఒక బీద బ్రాహ్మణబాలుడు భిక్షకై పూజారి యింటికి వచ్చెను. అతడుకూడ నా భక్తుడయ్యెను. ఏలన వానికి పిల్లను కుదిర్చితినని నాయందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈజన్మలో కూడ ధనముకై మిగుల తాపత్రయ పడుచుండెను. నా వద్దకు వచ్చి యాతడు కుటుంబముతో నుండుటచే తన కెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను.

ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి యదృష్టముకొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా నిచ్చిన పొలము ఒకలక్ష రూపాయల కమ్మిరి. ఆమె యాభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరు సమ్మతించిరి. కాని, ధనమునకై తగవులాడిరి. సలహాకొరకు నావద్దకు వచ్చిరి. ఆ యాస్తి మహాదేవునిది, కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లెనిదే యేమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి యధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నా పై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి, దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే నామె పగటి పూట నా వద్దకు వచ్చి యితరుల మాటలు పట్టించుకొనవలదని తనను కూతురుగా జూచుకొనవలెనని వేడుకొనెను. ఆమె నా యాశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు సప్తసముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికొక స్వప్నదృశ్యము గనపడెను. మహాదేవుడు స్వప్నములో గనిపించి యిట్లనెను. "ధనమంతయు నీదే. ఎవరికి నేమియును ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామతు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరములకైవ్యయము చేయవలసి వచ్చునపుడు మసీదులోనున్న బాబా సలహా తీసికొమ్ము." గౌరి నాకీ వృత్తాంతమంతయు దెలిపెను. నేను తగిన సలహా నిచ్చితిని. అసలును తీసికొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్ప కివ్వుమనియు వీరభద్రప్ప కిందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహా నిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప, చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంతవరకు వారిని సమాధానపరచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్నదృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్న బసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములబట్టి నన్నే యాశ్రయించెను. వాని కోపిష్ఠి శత్రువు బారినుండి కాపాడెదనని నేను వానికి వాగ్దానము చేసితిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను; చెన్నబసప్ప కూడ చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెక బెక లాడుట విని, నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి దెచ్చుకొని, ఇక్కడకు వచ్చి వానిని రక్షించి, నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. భగవంతుడు నన్నిచటకు బంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల."

నీతి

ఈ కథవల్ల మనము నేర్చుకొనిన నీతి యేమన ఎవరు చేసిన దానిని వారే యనుభవించవలెను. ఇతరులతోగల సంబంధములన్నిటిని, బాధను కూడ అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తన కెవరితోనైన శత్రుత్వమున్నయెడల దానినుండి విముక్తినిపొందవలెను. ఎవరికైన ఏమైనను బాకీయున్న దానిని తీర్చివేయవలెను. ఋణము గాని, శతృత్వశేషముకాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాసగలవానినది హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియేడవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

0 comments:

Post a Comment