Total Pageviews

Tuesday, August 19, 2014

శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

 కొంచమైనను భక్తి ప్రేమలతో నిచ్చినదానిని ఆమోదించెదననియు గర్వముతోను, అహంకారముతోను, ఇచ్చిన దానిని తిరస్కరించెదననియు బాబా నిరూపించెను. బాబా పూర్ణ సత్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైన భక్తి ప్రేమలతో నేదైన సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనెడివారు. నిజముగా సద్గురుసాయికంటె నుదారస్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు, వారికి సమానము కావు. మనము కోరినదెల్ల నిచ్చు కామధేనువు కూడ బాబాతో సమానము కాదు. 
బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులను సమర్పించవలెను. అవి యేవన :- 1. పంచ ప్రాణములు; 2. పంచేంద్రియములు; 3. మనస్సు; 4. బుధ్ధి; 5. అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా యాత్మసాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమయినది. అది కత్తివాదరవలె మిక్కిలి పదునైనది." 
బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత
అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము. 

1. ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమయిన కోరిక
ఎవడయితే తాను బద్దుడనని గ్రహించి బంధనములనుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖఃములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు.
 

2. విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట
ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.
 

3. అంతర్ముఖత (లోనకు జూచుట)
మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యు డెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని, ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడ వలయును.
 

4. పాపవిమోచన పొందుట
మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుధ్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్ట లేనప్పుడు జ్ఞానముద్వార కూడ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.
 

5. సరియయిన నడవడి
ఎల్లప్పుడు సత్యము పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు, బ్రహ్మచారిగ నుండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు.
 

6. ప్రియమైనవానికంటె శ్రేయస్కరమైనవానిని కోరుట
లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది సంతోషకరమయినది. మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో నొకదానిని అత డెంచుకొనవలెను. తెలివి గలవాడు, మొదటిదానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవదానిని కోరును.
 

7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట
శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ధి ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱములవలె) వాడు గమ్యస్థానమును చేరడు. చావుపుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱమువలె) వాడు గమ్యస్థానము చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేర గలడు; విష్ణుపదమును చేరగలడు.
 

8. మనస్సును పావనము చేయుట
మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించనియెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైనదానిని కనుగొనుట), వైరాగ్యము (అసత్యమైనదానియం దభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, ఆత్మసాక్షాత్కారమున కవకాశము లేదు. నేను శరీరమనుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమం దభిమాన ముండుటయే బంధమునకు కారణము. నీ వాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ యభిమానమును విడువవలెను.
 

9. గురువుయొక్క యావశ్యకత
ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరిము గూఢమైనది. ఎవ్వరైనను తమస్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువునుండి పొందవచ్చును. వారా మార్గమందు నడచియున్న వారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతి లో క్రమముగా ఒక మెట్టు మీదినుంచి యింకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.
 

10. భగవంతుని కటాక్షము
ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమును తరింపజేయగలడు. వేదము లభ్యసించుట వల్లగాని మేధాశక్తివల్లగాని పుస్తకజ్ఞానము వల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు". అట్టి వారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు" నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.
 

ఈ ఉపన్యాసము ముగిసిన పిమ్మట బాబా యా పెద్దమనుష్యునివైపు తిరిగి "అయ్యా ! నీ జేబులో బ్రహ్మము యాబదింతలు 5 రూపాయల నోట్ల రూపముతో నున్నది. దయచేసి దానిని బయటకు దీయుము". అనెను, ఆ పెద్దమనుష్యుడు తన జేబునుంచి నోటులకట్టను బయటకు దీసెను. లెక్క పెట్టగా సరిగా 25 పదిరూపాయల నోట్లుండెను. అందరు మిక్కిలి యాశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞత్వమును జూచి వాని మనస్సు కరగెను. బాబా పాదములపై బడి వారి యాశీర్వదమునకై వేడెను. అప్పుడు బాబా యిట్లనెను. "నీ బ్రహ్మపు నోటులకట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను, లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై యున్నదో, వాడా యభిమానమును పోగొట్టుకొననంతవరకు బ్రహ్మము నెట్లుపొందగలడు? అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఖఃమను సుడిగుండము వంటిది. అది యసూయ యహంకారమను మొసళ్ళతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి.
 

ఎక్కడ పేరాశగలదో యక్కడ బ్రహ్మముగూర్చి యాలోచించుటకు గాని ధ్యానమునకుగాని తావులేదు. అట్లయినచో పేరాశగల వాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి శాంతి గాని, సంతుష్టిగాని, దృఢనిశ్చయముగాని యుండవు. మనస్సునం దేమాత్రము పేరాశ యున్నను సాధనలన్నియు (ఆధ్యాత్మిక ప్రయత్నములు) నిష్ప్రయోజనములు.
 
ఎవడయితే ఫలాపేక్షరహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్పచదువరి యైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారము పొందుట కిది వానికి సహాయపడదు. ఎవరహంకారపూరితులో, ఎవరింద్రియ విషయములగూర్చి యెల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను." 

"ఏ దేశమునందు ఈ యపూర్వమైన విలువగల పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో యదియు ధన్యము. ఏ తల్లి దండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు." 
భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టములను బాధలను తొలగించి, మనల సంతోషపెట్టును. ఈ యభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయమువలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదుకవలెను. వారి కథలను విమానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడుగాని కష్టములు, నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియువేళకు భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠేగారికి కూడ అట్టి యనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా నిచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి. నవలెను. వారి పాదములకు సాష్టాంగనమస్కారము చేసి వారి సేవ చేయవలెను.
ఎదైన సంబంధ ముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని యెట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని చక్కగ ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా యితరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైన ధనముకొఱకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుట కిష్టము లేకున్నచో, నీవు ఇవ్వనక్కరలేదు, కాని వానిపై కుక్కవలె మొఱగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను, నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నీశ్చయముగా నీకు సంతోషము కులుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికి నీవు చలించకుము. నీ వున్న చోటనే స్థైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలింపుము. అప్పుడు మన మిద్దరము కలియు మార్గ మేర్పడును. నాకు నీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిదే మన కైక్యత కలుగదు, 'అల్లా మాలిక్' భగవంతుడే సర్వాధి కారి. ఇతరు లెవ్వరు మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గ మసామాన్యము; మిక్కిలి విలువైనది; కనుగొన వీలు లేనిది. వారి యిచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. మన ఋణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరి కొకరు తోడ్పడి ప్రేమించి సుఖఃముగాను, సంతోషముగాను నుందుము గాక. ఎవరయితే తమ జీవితపరమావధిని పొందెరరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలుపువరకు మాత్రమే బ్రతికెదరు."
మలినమును పోగొట్టుట కనేకమార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒకవిధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు గావున తిట్లుబడినవాడు, తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన యపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండీతోటకు బోవునప్పుడు మిట్టమధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని జూపి యిట్లనెను. "చూడుము! ఈ పంది కసుపును యెంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావమట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునేతిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగ నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా?" భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఎవరైన సర్వస్యశరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో, చక్కెర-తీపి, కెరటములు-సముద్రము, కన్ను-కాంతి, కలిసి యున్నట్లే అనుభవము పొందెదరు. ఎవరయితే చావుపుట్టుకలనుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మికజీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు భాధించునట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తనకర్తవ్య కర్మల నాచరించుచు భగవంతునికి సర్వస్యశరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరయితే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని, యితరులకు చెప్పెదరో, ఇతరవిషయము లేమియు నాలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేకమందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని, శరణువేడుమనెను. 'తానెవరు' అనుదానిని తెలిసికొనగోరువారికి శ్రవణమును, మననమును చేయుమని సలహా నిచ్చెడివారు.

భగవంతుడన్ని వస్తువులయందు గలడు. కావున భగవంతు డేది యిచ్చెనో అదియెల్ల తన మేలుకొరకే యని గ్రహించవలెను. దీనిని బట్టి యితరుల సొత్తుకై యాశించరాదనియు ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలుకొరకే దాని నిచ్చియున్నాడనియు, కావున నది మనకు మేలు కలుగజేయుననియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి యేమన మనుష్యుడెల్లప్పుడేదోతనకు విధింపబడిన కర్మను చేయుచునే యుండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలను నెరవేర్చవలెను. భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండ నుండుట యాత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుటవలన వైష్కర్మ్యాదర్శనము పొందును. ఏమానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ యన్నిటియం దుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు, సకలవస్తువులు ఆత్మగా భావించునో, యట్టివాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో నాత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడయితే సకలవస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికయితే సమస్తమాత్మయగునో, వానికి మానవులు పడు సామాన్యబాధలతో సంబంధము లేదు. అనగా నతడు కష్టములకు మార్పుజెందడు. 

0 comments:

Post a Comment