Total Pageviews

Wednesday, July 10, 2013

శ్రీవిష్ణు సహస్ర నామం









1.    విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుహుః     



      భూత కృ ద్భూత భృధ్వావో భూతాత్మా భూతభావనః  



అర్ధము: ఈ సృష్టియంతయు విష్ణువుచే వ్యాప్తి చెందియున్నది.  అతడు విశ్వమంతయు నిండి అందు నివసించి  ఉన్నవాడు.  అతడే జరిగినది, జరుగబోవునది మరియు జరుగుచున్నది అను కాలము.  అతడు ఈ సృష్టికి పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త.  అతడు భూతములకు ఆత్మయైనవాడు.  కనుక వానిని భరించి పోషించుచున్నాడు.  తన ఉదరమందే జీవులను కల్పించుచున్నాడు.  

శ్లోకం 2.     పూతాత్మా పరమాత్మాచ ముక్తానాం పరమాగతిః    

                 
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ || 

తాత్పర్యము: పరిశుధ్ధమైన ఆత్మ కలవాడు, గొప్ప ఆత్మయైనవాడు, మోక్షము పొందిన జీవులకు ప్రధాన లక్ష్యముగా నున్నవాడు, తరుగుట యనునది లేనివాడు, దేహమునందున్న ప్రజ్ఞలన్నింటినీ గమనించువాడు, ఉపాధియందుండి తెలిసికొనువాడు, నాశనము లేనివాడు కదా !  (అక్షరః = నాశనము లేనివాడు, ఏవచ = ఆవిధముగానున్నాడు కదా)  

 3  యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 

   

   నారసిం హవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః  ||



తాత్పర్యము: ఆయనే యోగము, యోగులకు నాయకుడైయున్నవాడు. మూల ప్రకృతిలేక మాయగా వచ్చినవాడు.  పురుషులకు ఈశ్వరుడైనవాడు. నృసిం హ రూపముతో వచ్చినవాడు, లక్ష్మీదేవికి భర్త. లోకములే ఆయన కేశములు. ఉత్తమ పురుషుడను ప్రవృత్తిచే తెలియబడినవాడు. 



యోగమనగా అన్నిలోకములలోను ప్రజ్ఞ మేల్కొని యుండుట. అన్నమయము (భౌతికము) ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయమను కోశముల యందన్నిటియందు జీవులు సమానముగా మేల్కొని యుండు స్థితి.  దీనిని సాధించుకొనుటకే యోగాభ్యాసము ఆవశ్యకము.  అట్టి యోగాభ్యాసము ప్రారంభింపవలెనన్న కోరిక పరమాత్మనుండియే మనయందు పుట్టుచున్నది.  కనుక పరమాత్మయే యోగమను పేర కూడా తెలియబడుచున్నాడు.  



అందుచేత యోగసాధన చేయువారికి, ప్రారంభించువారికి నాయకుడు లేక మార్గ దర్శకుడు నారాయణుడే అగుచున్నాడు. యోగాభ్యాసము మొదట ఒక సద్గురువునొద్ద ఉపదేశము పొందవలెను అట్లు ఉపదేశించు గురువు ద్వారా యోగము నారాయణుడే ఉపదేశించుచున్నాడు.  అనగా గురువు నుండి శిష్యులలోనికి నారాయణుడే ప్రవేశించుచున్నాడు.  

4. శ్లోకం మరియు అర్ధం:

శ్లోకం:  సర్వ శ్శర్వ శ్శివ స్ఠాణు ర్భూతాధిర్నిధిరవ్యయః    

         సంభవో భావనోభర్తా ప్రభవః ప్రభురీశ్వరః  ||

సమస్తము తాను అయినవాడు, హింసను నశింపచేయువాడు, శుభము కలిగించువాడు, భూతములకు స్థిరమైన కారణమైనవాడు, వ్యయము కాని నిధి అయినవాడు, భావమై పుట్టుకయైనవాడు, భరించువాడు, మేల్కొలుపటకు సమర్ధుడైనవాడు, ఆట్లు సృష్టివైభమునకు కారణమైన వానికి నమస్కారము.  



సమస్తమనగా సృష్టియందలి మరియు దానికి అతీతముగా ఉన్న మొత్తము పరమాత్మ యొక్క ప్రజ్ఞయే.  

శర్వః అనగా హించించువాడు లేక నశింపచేయువాడు.   సృష్టినతటినీ నశింపచేయుట అనగా సమస్తము దేనినుండి పుట్టినదో దానియందు లయమగుట.

శివుడనగా శుభము లేక మంగళము కలిగించువాడు; జీవులకు తాత్కాలిక శుభములను సుఖములను కల్గించుటతో ప్రారంభించి శాశ్వత సుఖమును,  ఆనందమును కల్షించువాడు.  అందుచేతనై నాస్తికుడు అయినవాడు మొత్తమొదటగా భగవంతునికి తన కష్టములు తొలగింపుమని మ్రొక్కినచో వెంటనే జరుగును.  వానికి కష్టము తొలగిపోయి సుఖము కలుగును.  

స్థాణుః : రాయివలె స్థిరమయినవాడు. పరమాత్మ సృష్టికి వెలుపల, లోపల కూడా స్థిరమయి యుండును.

భూతది:  అన్ని భూతములకు, ప్రాణులకు, జీవులకు తను పుట్టుక అయి వున్నాడు.

నిధిః : దాచబడిన సంపద అయినవాడు  

అవ్యయః : వ్యయమగుట లేనివాడు, లేక నశించుట లేనివాడు.

సంభవః : పుట్టుక లేక కలిగించుట అనుదానికి అధిపతి అయినవాడు.

భావనః : భావమును నడిపించువాడు.

భర్తా : పోషించువాడు.

ప్రభవః : మేల్కొల్పుటకు లేక వ్యక్త మగుటము అధిపతి అయినవాడు.

ప్రభుః : సమర్ధుడు లేక అధిపతి.

ఈశ్వరః : సృష్టి వైభవమునకు అధిపతి అయినవాడు.    


5వ. శ్లోకం మరియు తాత్పర్యము. 

శ్లోకం :    స్వయంభూః  శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
     
              అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః   || 

పరమాత్మ తనంతట తానే పుట్టుచున్నాడు. శాంతియే తానై వ్యక్తమచుచున్నాడు. అదితి కుమారుడు, కలువ పువ్వులవంటి కన్నులు కలవాడు, శబ్ద స్వరూపమైనవాడు, మొదలు, తుది లేనివాడు. సృష్టి క్రమము ఏర్పరచువాడు లేక కల్పించువాడు, తానే సృష్టి కర్తయు అట్టి సృష్టి కర్తకు పాలకుడు అయి ఉన్నాడు.    


6వ. శ్లోకం మరియు తాత్పర్యము:

శ్లోకం:  అప్రమేయో హృషికేశః పద్మనాభో మర ప్రభుః 

         
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధృవః ||


భగవంతుడు కొలతల కతీతమైన హృదయమున కధిపతిగా పద్మమే తన నాభిగా తెలియబడువాడు.  ఆయన దేవతలకు ప్రభువు. విశ్వమును నిర్మాణము చేసినవాడు, మానవ జాతికి అధిపతియైనవాడు, సకల రూపములను చెక్కువాడు.  అందరికన్నా ఎక్కువ వయస్సు కలవాడు.  తానే ధృవమై స్థిరముగానున్నవాడు.     


7
వ.శ్లోకం మరియు తాత్పర్యము.

శ్లోకం:  అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః 

     
ప్రభూత స్త్రీ కకుబ్ధామ పవిత్రం మంగళం పరం || 

తాత్పర్యము: పరమాత్మను మన మన గ్రహణమున కతీతమైన వానిగా, చీకటికవ్వలనున్నవానిగా ధ్యానము చేయవలయును. ఆయన ఎఱ్ఱని కన్నులు కలిగి, మార్పులకతీతముగా నుండువాడు. ఆయన చక్కని రూపముగా ఏర్పడినవాడు. మూడు నామములు కలిగినవాడు. వెలుగే తన మార్గమైనవాడు మరియు నిర్మలమైనవాడు. అత్యుత్తమ మంగళ రూపము కలవాడు.  
 8 వ.శ్లోకం, తాత్పర్యము:

శ్లోకం:      ఈ శానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః  శ్రేష్ఠః ప్రజాపతిః 

          హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనః  ||  


తాత్పర్యము:  పరమాత్మను, మిక్కిలి గొప్పవానిగను, ప్రాణము నిచ్చువానిగను, మరియు ప్రాణముగను, అందరికన్న్నా పెద్దవానిగను, ఉత్తమమైన వానిగను, పుట్టుకకు కారణమైన వాడుగను, బంగారపు గ్రుడ్డ్జుగను భూమికి కేంద్రము మరియు గర్భము అయిన వానిగను, లక్ష్మీదేవికి భర్తగను, మధువు అను రాక్షసుని సం హరించిన వానిగను, ధ్యానము చేయవలయును. 



 9 వ.శ్లోకం, తాత్పర్యము:

శ్లోకం:  ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విద్మః క్రమః  

         
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ || 


తాత్పర్యము: పరమాత్మను జీవునియందు గల పరమాత్మగను, పరాక్రమము కలవానిగను, ధనుస్సు ధరించిన వానిగను, ప్రజ్ఞావంతునిగను, విశేషమైన క్రమము కల్గినవానిగను, విషయముల కతీతమైన వాడుగను, భయపెట్టుటకు వీలుకానివాడుగను,  విశ్వాసముగలవానిగను, పనులు నెరవేర్చువానిగను, ఆత్మవంతునిగను ధ్యానము చేయుము.  

 శ్రీవిష్ణుసహస్రనామం 10 వ. శ్లోకం, ప్రతిపదార్ధం 

                                 
                                     
శ్లోకం: సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 

       
అహః సంవత్సరో వ్యాళః  ప్రత్యయః సర్వదర్శనః ||


పరమాత్మ దేవతలకు అధిపతిగను, శరణ్యముగను, సహనముగను, అయిఉన్నాడు. విశ్వమునకు బీజమువంటివాడు. జీవుల పుట్టుకకు కారణమైనవాడు. అట్లే దినము, సంవత్సరము మరియు నర్వమువంటి కాలము తానేయున్నాడు.  విశ్వాసమునకు మూలము మరియు సమస్తమును దర్శింపచేయువాడు

.   12వ. శ్లోకం, తాత్పర్యం 

శ్లోకం: వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః 

       
అమోఘః  పుండరీకాక్షో వృష కర్మా వృషా కృతిః  ||

సృష్టియందలి సంపదగానూ, ఆసంపదను గోరు మనస్సుగనూ, సత్యముగను, ధర్మముగానూ, సామ్యము గలవానిగను, చక్కగా కొలువబడువానిగనూ, సముడుగనూ, వ్యర్ధముకానివానిగను, పద్మము వంటి కన్నులు కలవానిగనూ, వర్షము కలిగించువానిగనూ, వర్షమే తానైనవానిగనూ ధ్యానము చేయవలయును.      



 13వ. శ్లోకం, తాత్పర్యము

శ్లోకం:  రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశవాః   

         
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః  ||

పరమాత్మను చందస్సుల కధిదేవతగా, అనేక శిరములు కలిగినవానిగా, సృష్టియందలి వర్ణములన్నియు తన రూపమైనవానిగా, విశ్వమునకు పుట్టుకయైనవానిగా మరియు విశ్వమునందు పుట్టుచున్నవానిగ, మృత్యువు లేనివానిగ, శాశ్వతునిగ, చైతన్యము లేనివానిగ, ఉత్తమమైన పుట్టుక కలవానిగ, గొప్ప తపస్సు చేయువానిగ మరియు తపస్సే తానైనవానిగ ధ్యానము చేయుము. 



14వ.శ్లోకం, తాత్పర్యము 

                              

శ్లోకం:     సర్వగస్సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్ధనః  

             
వేదో వేదవిద్వ్యంగో వేదాంగో  వేదవిత్కవిః     ||

తాత్పర్యము:  పరమాత్మను అంతట వ్యాంపించియుండు వానిగా, సమస్తమును తెలిసినవానిగా కిరణములను వెలుగు తానేయైన వానిగా, విశ్వమందలి సేనలకు నాయకునిగా, జీవులను కాలముగా తనలోనికి స్వీకరించువానిగా, జ్ఞానము తెలియు వాడుగను,  వేదాంగములు తానే యగుటచే అంగలోపము లేనివానిగ పురాణములను కల్పించు కవిగ, మరియు అందలి పరమార్ధము తెలియబడువానిగను ధ్యానము చేయుము.     

శ్రీవిష్ణుసహస్రనామ  స్తోత్రం 15వ. శ్లోకం, తాత్పర్యము                                              


శ్లోకం: లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 

        చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దం ష్ట్రః చతుర్భుజః  ||

పరమాత్మను లోకములకు అధ్యక్షునిగను, దేవతలకు అధిపతిగను, ధర్మమునకు నిర్వాహకునిగను, సాధింపబడినది మరియు సాధింపబడవలసినదిగాను, నాలుగు స్థితులుగా వ్యక్తమగువానిగను, నాలుగు వ్యూహములుగా తెలియబడువానిగను, నాలుగు కోరలు గలవానిగను, నాలుగు భుజములు గలవానిగను ధ్యానము చేయుము.  

16వ. శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 

         
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః  || 

భగవంతుని దీప్తివంతునిగను, జీవుల ఆహారము తానేయైనవానిగను, జీవుల ద్వారా అహారము స్వీకరించువానిగను, సహనమే తన రూపమైనవానిగను, ప్రపంచమునకు మొట్టమొదట పుట్టినవానిగను, జయించిన వానిగను, విశ్వమునకు పుట్టుక  తానేయైనవానిగను, ధ్యానము చేయుము.     

17వ. శ్లోకం, తాత్పర్యము

శ్లోకం: ఉపేంద్రో వావామనహః   ప్రాంశు రమోఘశ్శుచి రూర్జితః

        అతీంద్ర స్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః  || 

పరమాత్మను ఇంద్రుని సోదరునిగను, పొట్టివానిగను, ఉన్నతునిగను, ఇంద్రుని అతిక్రమించినవానిగను, చక్కని గ్రహణము గలవానిగను, సృష్టియందలి జీవుని ధరించినవానిగను, నియమము మరియు యమము అనునవి తానేయైన వానిగను, ధ్యానము చేయవలయును.   

18 ,శ్లోకం, తాత్పర్యము

శ్లోకం:  వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః 

            
అతీద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః  || 

పరమాత్మను తెలియబడువానిగా, వైద్యునిగా, యోగిగా, మరియు వీరులను జయించువానిగా, లక్ష్మీదేవి భర్తగా, మధురమైనవానిగా, యింద్రియముల కతీతమైనవానిగా, మాయల కతీతమైన వానిగా, గొప్ప ఉత్సాహవంతునిగా, గొప్ప బలసంపన్నునిగా, ధ్యానము చేయుము. 



19 వ. శ్లోకం, తాత్పర్యము

శ్లోకం: మహా బుధ్ధిర్మహా వీర్యో మహాశక్తిర్మహాద్యుతిః

           
అనిర్దేశ్య వపుశ్శ్రీ మానమేయాత్మా మహాద్రిధృత్ 

పరమాత్మను బుధ్ధికి ఆధారమైనవానిగా, వీర్యవంతునిగా, శక్తిమంతునిగా, మహాప్రకాశముగా, ఊహకందని పరిణామము గలవానిగా, పరిమాణము లేనివానిగా, లక్ష్మీదేవికి భర్తగా, కొలతలకు లేక మానములకందనివానిగా, మహాపర్వతమును పైకెత్తినవానిగా, ధ్యానము చేయుము.   


20)మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః|
అనిరుద్ధ స్సురానందో గోవిన్దో గోవిదాం పతిః||
తా: అమోఘమైన బాణముగలవాడు(శ్రీరాముడు).నిరోధింపజాలనివాడు, అసురసంహారియై దేవతలకు ఆనందమునిచ్చువాడు, భూదేవిని, శ్రీదేవిని ధరించినవాడు, సజ్జనులను, ఘొవులను రక్షించువాడు. విద్యావేత్తలకు ఆయనే ప్రభువు.
21)మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః|
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః
తా: ఆ మహాపురుషుడు మహాతేజశ్వి, మహా తపస్వి, బ్రహ్మను నాభియందు గలవాడు, దుష్టులను దండిచువాడు, జీవునితో సర్వదేహములందు కలసి ఉన్న పరమాత్మ, సర్వ జీవులకు అధిపతి, హృదయకమలమున భాసిల్లువాడు, పక్షులలో గరుత్మంతుడు, నాగులలో ఆదిశేషుడు.. ఆయనయే.

22.శ్లోకం, తాత్పర్యం 

శ్లోకం:  అమృత్యు స్సర్వదృక్సిం హస్సన్ ధాతా సంధిమాన్ స్థిరః 

         
అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా  ||  

పరమాత్మను మృత్యువు లేనివానిగా, సమస్తమును చూచువానిగా మరియు అందరి చూపు తన చూపైనవానిగా, సిం హమువంటి పరాక్రమము కలవానిగా, అన్నివిషయములను సంధాన పరచి సమన్వయము చేయువానిగా, స్థిరమైనవానిగా, పుట్టుక లేకపోవుటచే జయించుటకు సాధ్యము కానివానిగా, జగత్తును శాసించువానిగా, జ్ఞానుల ఆత్మ తానే అయినవానిగామరియు దేవతల శత్రువులను సం హరించువానిగా, ధ్యానము చేయుము.  

శ్రీ విష్ణుసహస్రనామం 23.శ్లోకం, తాత్పర్యము


శ్లోకం:  గురుర్గురుతమో ధామ స్సత్య స్సత్య పరాక్రమః  

         
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పత్తిరుదారధీః 


తాత్పర్యము: పరమాత్మ ఉపదేశికునిగాను, మరియు ఉపదేశికులందరికి గురువుగను, వెలుగు తనమార్గమైన వానిగను, సత్యముగా వెలుగు వానిగను, అట్టి సత్యముగనే లోకములన్నియు ఆక్రమించువానిగను, రెప్పపాటుగా నున్నవానిగను, మరియు అట్టి రెప్పపాటు తానే అయిన వానిగను, మాలను ధరించిన వానిగను, వాక్కునకు అధిపతిగను, తనంత తాను వ్యక్తమగు బుద్దిగా తెలియబడుచున్నాడు.  

23
. శ్లోకం:  గురుబ్రహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః 

               
గురుస్సాక్షాత్పరం బ్రహ్మా తస్మైశ్రీ గురవేనమః   

     
తాత్పర్యము: అని గురువునుద్దేశించి చేసిన ప్రార్ధన పూర్తిగా అర్ధవంతమే.  కాని కేవలము గురువును గౌరవించుటకు చెప్పినది గాదు.  యిది గురువును "ఉపాసన" చేయవలసిన విధానము.  సమస్త సృష్టిని పుట్టించువాడు, నడుపువాడు, మరల లయము చేయువాడు, గురువే.  అట్టి గురువే అన్నిటికి అతీతమయిన పరబ్రహ్మగ నున్నాడు.  ఆయనను శరణు పొందుచున్నాను అని ధ్యానము చేయవలెను. ఇట్టి ధ్యానమును మనస్సులో నిరంతరము ధారణ చేయు మనిషి ఇక చదువవలసిన వేదాంత గ్రంధములుండవు.  సకల పురాణ గ్రంధములు, వేదములు, ఉపనిషత్తులు, జీవుని ఇచ్చటకు తీసుకుని వచ్చి విడచును. అటుపైని శిష్యుని పురోగమనమును గురువు స్వయముగా నిర్ణయించును.  అట్టి నిర్ణయము కూడా శిష్యునికి తెలియవలసిన అవసరము లేదు.   తరువాత గురువు ఆజ్ఞపై గ్రంధము చదివిననూ శిష్యుని అనుక్షణము గురువు యొక్క సాన్నిద్యమును అనుభవించుచునే యుండును.  సకల జీవుల రూపమున గురువే కనుపించును.  దీనిని గూర్చి వివేకానందుడు "నిజమయిన శిష్యుడు" అను తన ఉపన్న్యాసమున వివరించెను. శిష్యునికి యిట్టి ఆత్మ సంస్కారము కలిగి నిజమైన శరణాగతి పొందువరకు గురువు వేచియుండును.  శిష్యుని హృదయమునందున్న పరమాత్మయే గురువుగా శిష్యుని వద్దకు వచ్చుచున్నాడు.  గురువుయొక్క శరీరము వేరైనను పని చేయుచున్నది శిష్యునిలోనున్న గురువను పరమాత్మే.

మన దేహము, ప్రాణము, మనస్సు, యింద్రియములు మున్నగువన్నియునూ పరమాత్మ యను వెలుగునుండి వచ్చినవే గనుక, తిరిగి భగవంతుని చేరుటకు యివియే మనకు సాధనములగును.  అట్లు సాధనయను సంకల్పము గూడా, పరమాత్మనుండి జీవులయందు ప్రసరించు కిరణము.  కనుక పరమాత్మయే మరల జీవునికి మార్గమగుచున్నాడు

శ్రీవిష్ణు సహస్రనామం 24వ.శ్లోకం,తాత్పర్యం 

శ్లోకం:  అగ్రణీర్గ్రామణీ శ్శ్రీమాన్న్యాయో నేతా సమీరణః

         సహస్ర మూర్ధా విశ్వాత్మా సస్తాక్షస్సహస్రపాత్ || 

తాత్పర్యము:  పరమాత్మను, మొదటగానుండు వానిగానూ, జీవులను నడుపువానిగానూ, సంపదలకధిపతిగానూ, న్యాయమే తన రూపమైనవానిగా, నాయకునిగా, ప్రశాంతముగా వీచువాయువుగా, వేయి శిరస్సులు గలవానిగా, వేయి కన్నులు గలవానిగా, మరియూ వేయిపాదములు గలవానిగా, యింకనూ విశ్వమే తన ఆత్మయైనవానిగా, విశ్వమునకు ఆత్మయైనవానిగా ధ్యానము చేయుము. 

శ్రీవిష్ణు సహస్ర నామస్తోత్రం : 25వ. శ్లోకం, తాత్పర్యం:

శ్లోకం:  ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్ధనః

         అహస్సంవర్తకో వహ్నిరనిలో ధరణీ ధరః || 

పరమాత్మను త్రిప్పుట మరియూ తిరుగుట అను రెండు శక్తులుగా పనిచేయువానిగా, లేక ప్రాణము, అపానము అను రెండు శక్తులుగా పని చేయువానిగా, అనాసక్తునిగా, సృష్టిగా చుట్టబడి యున్నవానిగా, రాక్షస శక్తులను దమించువానిగా, దినాధిపతిగా, అన్నిటినీ తనలోనికి లీనము చేసుకొను లేక దహించు అగ్నిగా,  వాయువుగా, భూగోళము చోటులో నిలబడియుండుటకు ఆధారమైన వానిగా, ధ్యానము చేయుము.  

శ్రీ విష్ణుసహస్రనామం 26 వ.శ్లోకం

శ్లోకం:  సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృ డ్విశ్వ భుగ్విభుః  


         సత్కృతస్త్కృత స్సాధుర్జహ్నుర్నారాయణోనరః ||    

భగవంతుని అనుగ్రహించువానిగా, వరములు యిచ్చువానిగా, సృష్టికర్తగా, సృష్టిని పాలించువానిగా, మరియు తనలోనికి స్వీకరించువానిగా, లేక లయము చేయువానిగా, మంచిని కలిగించుట ద్వారా గౌరవింపబడువానిగా, జహ్నువు, నారాయణుడు, నరుడు మరియు ప్రశాంతులైన మహర్షులుగా, ధ్యానము చేయుము.   

శ్రీ విష్ణుసహస్ర నామం 27వ. శ్లోకం, తాత్పర్యము

శ్లోకం:  అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్చుచిః 

         సిధ్ధార్ధస్సిద్ధ సంకల్ప సిధ్ధిదః సిధ్ధి సాధనః  ||

తాత్పర్యము :  భవవంతుని సంఖ్యలకతీతునిగా, కొలతలకు అందని ఆత్మ రూపునిగా, ప్రత్యేకత గలవానిగా, జీవులయందు ప్రత్యేకత కల్గించువానిగా, నిర్మలమయినవారిలో నిర్మలత్వముగా, ధ్యానము చేయుము.   ప్రయోజనము సిధ్ధించిన వాడగుటచే తన సంకల్పము సిధ్ధింపబడెను.  మరియు సిధ్ధికి కారణమైనవానిగా అట్లు సిధ్ధించు మార్గము కూడా తానే అయిన వానిగా, ధ్యానము చేయుము.    
      శ్రీవిష్ణు సహస్రనామం 28 వ.శ్లోకం, తాత్పర్యం 

శ్లోకం:  వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వో వృషోధరః 

         వర్ధనో వర్ధమానశ్చ వివిక్తిశ్శ్రుతి సాగరః  ||

తాత్పర్యం: పరమాత్మను, వృషభాసురుని సం హరించినవానిగా, గొప్ప వృషభముగా, అంతటనూ వ్యాపించువానిగా, భూమిని ఫలవంతము చేయు నైసర్గిక బీజములు గలవానిగా, వృషభము వంటి ఉదరము గలవానిగా, అభివృధ్ధియైనవానిగా, మరియు జీవులలో అభివృధ్ధి పొందువానిగా, సృష్టియందు ఉన్ననూ దానినంటక వేరుగానున్నవానిగా, అంతటనూ వ్యాపించి యున్నవానిగా, వేదముల సారము తెలిసినవానిగా ధ్యానము చేయుము.  

0 comments:

Post a Comment