Total Pageviews

Friday, February 28, 2014

డీ వీ డీ వల్ల ప్రయోజనాలు (తెలుగు అనువాదం త్యాగరాజు గారు నరసాపురం)

శ్రీవిష్ణుసహస్రనామం, శ్రవణం చేయడం వల్ల, వినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియచేస్తున్నాను.కెనడానుండి శ్రీనగిశెట్టి రమేష్ కుమార్ గారు ఈ విషయాలన్నిటినీ తెలియచేస్తున్నారు.  ఇక చదవండి.   

డీ వీ డీ వల్ల ప్రయోజనాలు


షిరిడీ సాయిబాబావారి అనుగ్రహాన్ని పొందడమేలా?



ప్రతీ రోజు మీరు మీ యింటిలో షిరిడీసాయిబాబా వారి హారతులు, కాకడ హారతి, మధ్యాహ్న్న హారతి, ధూప్ హారతి, శేజ్ హారతి అన్నీ డీ.వీ.డీ లో వినవచ్చును.


సాయి భక్తులందరి కోసం బాబా హారతులన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు, డీ.వీ.డీ లను ఉచితంగా పంచడానికి అనుమతినిచ్చిన శ్రీ కె.వీ.పీ.రమణి, షిరిడీ సాయి ట్రస్ట్ చెన్నై గారికి ధన్యవాదాలు.  డీ.వీ.డీ లో శ్రీ సాయి సత్ చరిత్రను కూడా వినవచ్చు.  మొత్తం అన్ని అధ్యాయాలు వినడానికి 6 గంటల సమయం పడుతుంది.  తెలుగులో శ్రీసాయి సత్ చరిత్ర, చాలీసాలను కూడా భక్తుల సౌకర్యం కోసం డీ.వీ.డీ లలో చేర్చడానికి అనుమతినిచ్చినందుకు శ్రీ కె.రాజేంద్రప్రసాద్, హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు. 



సమస్యల పరిష్కారానికి శ్రీమహావిష్ణువుయొక్క అనుగ్రహాన్ని పొందుట ఎట్లు? 


ఏకాగ్రతతోను, భక్తితోను, విష్ణుసహస్రనామావళిని 225 సార్లు వినండి.  శ్రీమహావిష్ణువుకు మీ సమస్య చెప్పుకొని విష్ణుసహస్రనామం 225 సార్లు వినండి లేక పారాయణ చేయండి.  ఆ తరువాత మీ సమస్య  పరిష్కారమవడం మీకే తెలుస్తుంది.  ఆయన కర్మఫల ప్రదాత.  కోర్కెలను పుట్టించేదీ ఆయనే, తీర్చేదీ, ధ్వంసం చేసేదీ కూడా ఆయనే.  ఆయన సృష్టి స్థితి లయకారకుడు.


కెనడాలో ఉంటున్న షిరిడీసాయి భక్తులయిన శ్రీ నగిశెట్టి రమేష్ కుమార్ గారు, విష్ణుసహస్ర నామం 225 సార్లు విన్న తరువాత, లేక చదివిన తరువాత సమస్యలు పరిష్కారమవడం  పరిశోధించి కనుక్కొన్నారు.  ఎంతో సాధన, అధ్యయనం చేసి కనుగొన్న ఈ విషయాన్ని ఆయన షిరిడీ సాయి, శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో భారత దేశంలోని సాయి భక్తులందరి దృష్టికి తీసుకురావడానికి గత మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. 


మేము దీనిని సంక్షిప్తంగా 18 నిమిషాలు ఉండేలాగ రూపొందించాము.  పూర్తిగా 30 నిమిషాల నిడివి ఉన్నది యింకా ఎక్కువ ఫలితాలనిస్తుంది.  చదివితే మంచిది కాని, విఘ్నాలు కలగడానికి ఆస్కారం ఉండటంవల్ల అది కాస్త కష్టం.  ఏకాగ్రతతోను, భక్తితోను, వినడం చాలా సులభం.  ఎవరయినా భక్తితో సంగ్రహరూపంలో ఉన్న విష్ణుసహస్ర నామాలని 15 సార్లు వింటే సమస్య ఏదయినా 15 రోజులలో పరిష్కారమవుతుంది.  ఆయనకి సంగ్రహ రూపంలో ఉన్న విష్ణుసహస్ర నామాలు వినడానికి రోజుకి గం.4.30ని.పడుతుంది. పూర్తిగా ఉన్నది వినడానికి 7 గంటల సమయం పడుతుంది.  శ్రీ విష్ణుసహస్రనామావళిని సాధన చేసి దానిని తన స్టూడియోలో రికార్డు చేసిన శ్రీమతి రాజగోపాలన్, కుక్స్ విల్లె, టెన్నెసె, అమెరికా, గార్కి కృతజ్ఞతలు.  విష్ణుసహస్ర నామం యింఫో ఆడియో బ్లాగ్ స్పాట్ నుండి కాపీరైట్ లేకుండా సాయిభక్తులందరు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడానికి అనుమతినిచ్చారు.  విద్యావంతులు కానివారు, సంస్కృతం రానివారు భక్తితో వింటే ఎంతో ప్రయోజనాన్ని పొందుతారనే నమ్మకం మాకుంది.   



ఈ డీ.వీ.డీ ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడమేలా? 

               

ఆంగ్లము లేదా హిందీలో భగవద్గీతలోని 40 శ్లోకాలను ప్రతిరోజు వినండి.  దానికి 12 నిమిషాలు మాత్రమే పడుతుంది.  మీకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు భగవద్గీత మొత్తం ఆంగ్లం లేదా హిందీ లేదా సంస్కృతంలో వినండి.  శ్రీమద్ భగవద్గీత 18వ. అధ్యాయం 67,68 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ, తనే స్వయంగా ఈవిధంగా చెప్పారు. 



67వ.శ్లోకం.  తపస్సంపన్నుడు కానివానికిని, భక్తి రహితునకును, నన్ను ద్వేషించువానికిని నీవు ఈ గీతా రహస్యోపదేశమును ఎన్నడునూ చెప్పరాదు.


68వ.శ్లోకం. నాయందు పరమ భక్తి కలిగి, ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతా శాస్త్రమును నాభక్తుల మదిలో పదిలపఱచువాడు నన్నే పొందగలడు.  ఇందేమాత్రమూ సందేహము లేదు.  అందుచేత భక్తితో భగద్గీతను చదివినా లేక గీతా సారాంశమును భక్తులందరిలోను వ్యాపింప చేసినా శ్రీకృష్ణ పరమాత్మయొక్క అనుగ్రహం లభిస్తుంది.  అందరికి గీత గురించి తెలుసుకాని గీతలోని అర్ధం తెలియదు.  అందులో ఏమున్నదో కూడా తెలియదు.  సాయి భక్తులయిన శ్రీనగిసెట్టి రమేష్ కుమార్ కెనడా వారికి భగద్గీత పూర్తిగా చదివే అవకాశం లభించింది.  తరువాత అందులోని ప్రధానమైన 130 అంశాలను తయారుచేసి వాటిని 1000 సార్లకు పైగా చదివారు.  తరువాత అంతర్జాతీయ గీతా సొసైటీ కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ. వ్యవస్థాపకులయిన  డా.రామచంద్ర ప్రసాద్ జీ గారినుంచి ఆడియో డీ.వీ.డీ.గా కాపీ చేసి భక్తులందరికీ ఉచితంగా పంచడానికి అనుమతి లబించింది.  ఆయన భగవద్గీతను సంస్కృతంలో కూడా తయారుచేశారు.  దీనిని పూర్తిగా వినడానికి 3 గంటల సమయం పడుతుంది.  ఆయన దీనిని రోజుకు 4 సార్లు చొప్పున 2 రోజులు విన్నారు.  విన్న తరువాత 3 సంవత్సరాలకి అపరిష్కృతంగా ఉన్న ఆయన సమస్య తీరిపోయింది.  ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా భక్తితో గీతను విన్న భక్తులకు ఎవరికి తగినట్లుగా వారికి సత్ఫలితాలను శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహిస్తారు.  అందుచేత మీరు గీత మొత్తం అధ్యాయాలు ఆంగ్లం, హిందీ,సంస్కృతంలో ఉన్న డీ.వీ.డీ లు మీదగ్గర ఉంచుకుంటే మంచిది.    



డీ.వీ.డీ. ద్వారా దుర్గామాత అనుగ్రహాన్ని పొందడమెలా?

                
దుర్గాసప్తశతిని భక్తితో మీరు పూర్తిగా సంస్కృతంలో వినవచ్చు.  భక్తులు ఎవరయితే దుర్గా సప్తశతిలోని 12వ.అధ్యాయాన్ని చదువుతారో లేక వింటారో దుర్గామాత సంతసిస్తుంది.  ప్రత్యేకమయిన సందర్భాలలో అనగా అష్టమి, నవమి, చతుర్దశి, రోజులలో భక్తితో చదివినా, వినినా భక్తుల కోరికలు నెరవేరుతాయి. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం వాస్తవ్యులు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న శ్రీ పీ.వీ.ఆర్.నరసిం హారావుగారు దుర్గాసప్తశతిని  డీ.వీ.డీ.లో రికార్డ్ చేశారు.   దానిని కాపీ చేసుకొని భక్తులకు ఉచితంగా పంచడానికి అనుమతినిచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.   


పరశురాముని శాపం వల్ల సనాతన ధర్మంలోని మంత్రాలకున్న శక్తి నశించిందని వరాహసం హితలో చెప్పబడింది.  ఏమయినప్పటికి భగవద్గీత, విష్ణుసహస్రనామం, దుర్గాసప్తశతి, వీటియొక్క శక్తికి ఎటువంటి విఘాతం కలగలేదు.  భక్తులకు వీటివల్ల వెంటనే సత్ఫలితాలు కలుగుతున్నాయి.  వీటిని చదివిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరికీ కూడా వీటి గురించిన సమాచారమంతా తెలియపర్చాలని నాకు బాగా అనిపించింది.  వారందరికీ సహాయపడాలనిపించింది.  విష్ణుసహస్రనామం కొన్ని వేల సార్లు విన్న తరువాత, గీతా సారాంశాన్ని వెయ్యిసార్లు చదివిన తరువాత, దుర్గాసప్తశతిని 5 సార్లు చవగలిగాను.  ఆఖరికి 3సంవత్సరాల తరువాత అమెరికాలో ఉంటున్న భక్తులు, వారెవరికీ నేను తెలియకపోయినా భారతదేశంలో ఉన్న భక్తులందరికీ కూడా డీ.వీ.డీ.లను పంచడానికి అనుమతినిచ్చారు.   సంస్కృత శ్లోకాలను కాపీ చేసుకొని డీ.వీ.డీ. రూపంలో ఉచితంగా భక్తులందరికీ పంచడానికి www.prapatti.com వారు కూడా అనుమతినిచ్చారు.  200 పైగా ఉన్న శ్లోకాలలో 77 శ్లోకాలను ఎన్నుకొన్నాను.  అన్న్నింటి గురించి నాకు తెలియదు.  వాటిలో కొన్నింటియొక్క ఫలితాలను మాత్రం నేనివ్వగలను. సమయం దొరికినప్పుడెల్లా నేను వాటిని వింటూ ఉంటాను.  


1) అనారోగ్య సమస్యలున్నవారికి అగస్త్యముని రచించిన ఆదిత్య హృదయం చదివితే వారికి మంచి ఫలితం కనిపిస్తుంది. 

                   2)  వేదవ్యాసుడు రచించిన ఋణవిమోచన స్తోత్రం చదవడానికి 2 నిమిషాలు పడుతుంది.  ఎవరయినా ఈ స్తోత్రాన్ని రోజుకు 11 సార్లు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్కువ రోజులు చదివినా, లేక విన్నా వారి ఋణబాధలన్ని తొలగిపోయినట్లుగా నేనెక్కడో చదివాను.  నేను ప్రయత్నించలేదు కాని భక్తులను నేను కోరేదేమిటంటే భక్తితో ఈ ఋణవిమోచన స్తోత్రం చదివి తమ అనుభవాలను మిగిలిన వారికి వివరిస్తే వారికి కూడా లాభం చేకూరుతుంది.  


3)కోరికలు తీరడానికి శనీశ్వర కృత నృసిం హస్తుతి  చదవాలి


4) ఈరోజుల్లో ప్రతివారు కోరుకొనేది లక్ష్మీ కటాక్షం.  లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు బ్రహ్మ విరచితమయిన మహాలక్ష్మీ కవచం, వేదవ్యాస మహాముని రచించిన మహాలక్ష్మీ అష్టకం, శ్రీకృష్ణపరమాత్మ కృత లక్ష్మీద్వాదశనామ స్తోత్రం, ఆదిశంకరాచార్య కృత కనకధారా స్తోత్రం యివన్నీ కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడ్డాయి. 


శ్రీకృష్ణపరమాత్మ కృత సాలిగ్రామ స్తోత్రం, బుధకౌశిక ముని విరచిత రామరక్షాస్తోత్రం, నారదమహాముని కృత వరాహకవచం, ఆంజనేయస్వామి కృత సీతారామ స్తోత్రం, యివన్నీ కూడా నాకిష్టమయిన శ్లోకాలు.  నాకు సమయం దొరికినప్పుడెలా వింటూ ఉంటాను.  తమ గానమాధుర్యంతో మధురంగా ఆలపించిన శ్రీసుందర్ కిడంబిగార్కి, యింకా వీటిని ఉచితంగా పంచడానికి అనుమతినిచ్చిన ప్రపత్తి.కాం గారికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.


సాయి భక్తురాలయిన కుమారి సుజనా సాయి, నెల్లూరు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.   దేవాలయ అధికారులతోను, యింకా ఎంతోమందిని కలిసి అన్ని విషయాలు చర్చిస్తూ సాయి సేవను కొనసాగిస్తున్నారు.  రోజంతా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ కూడా సాయి సేవ కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ, భగవద్గీత, విష్ణుసహస్ర నామావళి ఫలశృతి, ఆంగ్ల తెలుగుభాషలలో టైపు చేసి, డీ.వీ.డీ లు తయారు చేసి ఎంతోమంది సాయి భక్తులకు పంపిస్తున్నారు.  ఆమె సహాయం లేకుండా కెనడాలో ఉన్న నాకు భారతదేశంలోని సాయి భక్తులందరికీ డీవీడీలు పంపించడం సాధ్యమయేది కాదు.  ప్రతి మనిషి పుడుతూనే రెండు కర్మలను మోసుకొని వస్తాడు.


1) సంచిత కర్మ - మానవుడు ప్రతి జన్మలోను తనవెంట తీసుకొని వచ్చేది


2) ప్రారబ్ధ కర్మ - మానవుడు ఈ జన్మలో అనుభవించేది.


ఈ కర్మలన్నీ కూడా జన్మస్థలం, సమయం, గ్రహాల సంచారం వీటి మీద ఆధారపడి ఉంటాయి.  ఇందులో ఈ జన్మలో మంచి చెడులు కూడా కలిసి ఉంటాయి.  అందుచేతనే కొంతమంది మంచివారికి  కష్టాలు ఎందుకని కలుగుతాయో, చెడ్డవారు అభివృధ్ధిలో ఎందుకుంటారో యిటువంటి విషయాలన్నీ వివరంగా తెలుస్తాయి.  కర్మప్రాబల్యం చాలా బలంగా ఉంటుంది.  దానినుంచి ఎవరూ తప్పించుకోలేరు.  కాని ఈ కర్మప్రాబల్యాన్ని తప్పించుకోవాలంటే దానికి ఒక్కటే మార్గం.  జ్యోతిష్కుల వద్దకు వెళ్ళి వారు చెప్పినట్లుగా పూజలు చేయాలి.  ఇటువంటి పూజలు చేయాలన్నా చేయించాలన్నా ఎంతో డబ్బు ఖర్చవుతుంది.  మధ్య తరగతివారు, బీదవారు అంత మొత్తం పూజలకోసం ఖర్చు చేయలేరు.  



     అందుచేత ఈ కలియుగంలో కర్మలన్నిటి ప్రాబల్యాన్నించి తప్పించుకోవాలంటే భగవంతుని నామాన్ని భక్తితో శ్రవణం చేయడం గాని  లేక నిస్వార్ధంగా మానవ సేవ చేయడం గాని చేయాలి.  ఎక్కువమందికి నిస్వార్ధంగా మానవసేవ చేయాలంటే చాలా కష్టం.  ఏదైమనప్పటికీ భగవంతుని నామ శ్రవణం,లేక నిరంతరం భగవన్నామస్మరణ భక్తులకి చాలా సులభం.  నాస్తికులకి అవి సులభమయినది కాకపోవచ్చు.  విష్ణుసహస్రనామావళిలో శ్రీమహావిష్ణువుయొక్క వేయి నామాలు ఉన్నాయి.  వీటిని భక్తితోను, ఏకాగ్రతతోను విన్న ప్రతి భక్తునికి ఫలితం చేకూరుతుంది.  భగవద్గీత, దుర్గాసప్తశతి, విష్ణుసహస్రనామావళి చదవడం కష్టతరమయినది.  బాగా సాధన చేసినవారికి యిది కంఠతా వచ్చి సమయం చిక్కినపుడెల్లా చదువుకోవడం కష్టంగా అనిపించదు.  కాని, వినడం చాలా సులభం.  అందుచేతనే ఈ డీ.వీ.డీ లని ఉచితంగా పంచడమనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.   



మరి వీటిని వినడం ఎలా?  డీ.వీ.డీ. ప్లేయర్ లో గాని, కప్యూటర్ లోగాని, లాప్ టాప్ లో గాని వినడం చాలా సులువు.  మీకెవరికీ వీటిలో ఏది లేకపోయినా మీరు దీనిని మీ సెల్ ఫోన్ లో కాని, ఎం పీ 3 ప్లేయర్ లో గాని, సౌండ్ బాక్శ్ లో గాని కాపీ చేసుకోవచ్చు.  ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్ లు ఉన్నాయి.  అన్ని సెల్ ఫోన్ లకి మెమరీ కార్డులున్నాయి.  ఆవిధంగా కూడా ఈ సంస్కృత శ్లోకాలన్నిటినీ చక్కగా భక్తిభావంతో వినచ్చు.  ఒకవేళ సెల్ ఫోన్ లో కాపీ చేసుకొనేటప్పుడు సమస్యలు ఏమయినా ఎదురయితే కుమారి సుజనా సాయి నెల్లూరువారిని సంప్రదించండి.  ఆమె ఫోన్ నెంబరు 9701259667.  డీ.వీ.డీ లు పంపించిన కొద్ది మందినుంచి డీ.వీ.డీ ప్లేయర్ పనిచేయకపోవడం, యింకా కొన్ని సమస్యలు ఎదురయినట్లుగా నాదృష్టికి వచ్చింది.  తమకి డీ.వీ.డీ లో వినడానికి సమయం లేదని బిజీగా ఉన్నామని యిటువంటి కారణాలన్నిటినీ కొంతమంది  చెప్పడం జరుగుతోంది.  ఇటువంటి ఆటంకాలన్ని కర్మ ప్రాబల్యం వల్లనే జరుగుతూ ఉంటాయి.  శ్రీసాయినాధుడు లేక భగవంతుని అనుగ్రహంతో తమ చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.  ఎవరయితే భక్తితో శ్రవణం చేస్తారో వారికి వ్యత్యాసం తెలుస్తుంది.  మేము పనివత్తిడిలో ఉన్నామని చెప్పేవారికి, వారి వారి కర్మ ప్రకారేమే పనులన్ని జరుగుతాయి.  రెండు సంవత్సరాలనుండి మేము గమనించిందేమిటంటే 50సం.వయస్సు పైబడినవారు సాధారణంగా డీ.వీ.డీ వినడానికి యిష్టపడుతూ ఉంటారు.  కాని వారికి డీ.వీ.డీ నించి సెల్ ఫోన్ లోకి కాపీ చేయడం ఎలాగో తెలియదు.  30సం.లోపు వయసున్నవారికి సెల్ ఫోన్ లోకి కాపీ చేయడమెట్లాగో తెలుసు.  అందుచేత సాధారణంగా వారికి డీ.వీ.డీ లో వినడం అంత యిష్టం ఉండదు.  అందుచేత ఈ కార్యక్రమం పదవీవిరమణ చేసినవారికి, గృహిణులకు ఉద్దేశింపబడింది.  కారణం యివన్నీ వినడానికి వారికి తగిన సమయం ఉంటుంది.  వారందరికీ కొన్ని సమస్యలుంటాయి.  ఆసమస్యలు తీరాలంటే వారికి గురువు అనగా భగవంతుని అనుగ్రహం అవసరం.  అందుచేత విష్ణుసహస్రనామావళిని భక్తితో 225 సార్లు విని మీకు మీరే సహాయం చేసుకోవచ్చు.  ఒకసారి కనక మీకు నమ్మకం కుదిరితే క్రమం తప్పకుండా మీరే వింటూ ఉంటారు.  మీకు ఫలితాలు కూడా ఆవిధంగానే వృధ్ధి పొందుతూ ఉంటాయి.  మీరు భగవద్గీత, దుర్గాసప్తశతి, బాబా ఆరతులు, శ్రీసాయి సత్ చరిత్రలతోపాటు యింకా సంస్కృత శ్లోకాలు యివి కూడా వినడానికి ప్రయత్నించి చూడండి.  ఒకసారి మీరు వీటి సత్ఫలితాలను చూసిన తరువాత మీకు తెలిసిన భక్తులకి, స్నేహితులు, బంధువులకి, మీఅనుభవాలను చెప్పండి.  వారు కూడా లబ్ధిపొందుతారు.   



ఎప్పుడయితే ఎక్కువమంది భక్తులకి లాభం చేకూరుతుందో అప్పుడే దేశం సంపన్నంగా ఉంటుంది.



డీ.వీ.డీ లనుంచి మీరు కూడా కాపీ చేసుకొని మీకు తెలిసిన భక్తులకు కూడా పంపించవచ్చు.  అలా కాక మీరు ఈ విధంగా కూడా చేయవచ్చు.  ఒక డీ.వీ.డీ స్టిక్కర్ అంటించి తయారు చేయించడానికి రూ.15/- అవుతుంది.  50 డీ.వీ.డీలకు లేదా మీకు కావలసిన డీ.వీ.డీ లకు కొరియర్ కు అయే ఖర్చులను కుమారి సుజనాసాయి గారికి పంపించి డీ.వీ.డీ లు తెప్పించుకోవచ్చును.  వాటిని మీరు మీకు తెలిసిన భక్తులకి, మీస్నేహితులకు, బంధువులకు పంచవచ్చు.  ఇప్పటివరకు ఈ కార్యక్రమమంతా ఒక్కరి దాతృత్వంతోనే జరుగుతున్నందువల్ల వేగంగా జరగటల్లేదు. లక్షలాది మంది భక్తులకు సహాయ పడాలంటే అందుకు చాలా ఖర్చవుతుంది.  శ్రీషిరిడీసాయి, శ్రీమహావిష్ణువుల అనుగ్రహం మీకందరికీ లభించుగాక.  ఇంకా వివరాల కోసం కుమారి సుజనా సాయి, నెల్లూర్ 9701259667 గారిని సంప్రదించడి. 



భారతదేశంలో విష్ణుసహస్రనామావళి తెలుగు ఒక లక్ష కాపీలు వితరణ చేయడానికి సహాయ పడిన కెనడా, అమెరికా దాతలకు నాధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.   భారతదేశంలో లక్షకాపీలు పంచడానికి సహాయపడిన 300 పైగా స్వచ్చంద సేవకులకు (దేవస్థాన అధికారులతో సహా) అందరికీ నాధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.  ఈసారి భారతదేశంలో డీ.వీ.డీలు కాపీ చేసి మిగతా భక్తులందరికీ దేవాలయాల ద్వారా గాని మరే విధంగానయినా అనగా భక్తులద్వారా గాని పంచదలచాము.  ఈ కార్యక్రమానికి దాతలందరి సహాయం అర్ధిస్తున్నాను.  ఒక డీ.వీ.డీ. ఖరీదు రూ.15/- అవుతుంది.  మీరు 50 లేదా 100 డీ.వీ.డీలు తెప్పించుకొని భక్తులందరికీ పంచవలసిందిగా కోరుతున్నాను.  మీకింకా వివరాలు ఏమయినా కావాలంటే కుమారి సుజనాసాయి గారిని సంప్రదించడి.  విష్ణుసహస్ర నామావళిలోని కొన్ని ప్రత్యేకమయిన 10 శ్లోకాలు వాటి ప్రయోజనాల గురించి నాకు తెలియచేసిన స్వర్గీయ జీ.వీ.నరసిం హారావు గారు, కేశంపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లావారికి నాహృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.  



అనేక నమస్కృతలతో

రమేష్ కుమార్ నగిసెట్టి

కెనడా  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)   

0 comments:

Post a Comment