Total Pageviews

Thursday, May 26, 2016

షిరిడీలో నివాసం.........!!

తన మసీదు వరండాలో సాయిబాబా 1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “Aao Sai” "రండి సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' నామం స్థిరపడి అతడు "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు.
షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.
ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.
1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. యాచన అతని వృత్తి. మసీదులో ధునిని వెలిగించారు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించేవారని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవారు.
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.
తన స్వరూపం తాను తెలుసుకున్నవాడు జ్ఞాని. సూర్యుడికి చీకటి తెలియదు. జ్ఞానికి దుఃఖం తెలియదు. ఈ లోకాన్ని జ్ఞాని మాత్రమే ప్రేమించగలడు. జ్ఞానిది శివదృష్టి. అజ్ఞానిది శవ దృష్టి. ‘నేను ఆత్మను... నాకు ఒక దేహం ఉంది’ అని జ్ఞానికి తెలుసు. ‘నేను దేహాన్ని... నాకు ఒక ఆత్మ ఉంది’ అనుకొంటాడు అజ్ఞాని. జ్ఞాని దేహం దేవాలయం. దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి జ్ఞానికి జరగవలసిన పనులు జరుగుతుంటాయి కాని, కర్తృత్వం ఉండదు. జ్ఞాని శరీరం ధరించి ఉన్నంతమాత్రం చేతనే లోకానికి మేలు జరుగుతుంది. మల్లెతోటలో కూర్చుని మనకు పరిమళం రావాలని కోరుకోనక్కర్లేదు. అదేవిధంగా జ్ఞాని సన్నిధిలో కాంతి, శక్తి, శాంతి నిండి ఉంటాయి.

0 comments:

Post a Comment