Total Pageviews

Monday, September 2, 2013

ప్రేమతత్వమే సాయి తత్వం

సద్గురు షిర్డీ సారుుబాబా షిర్డీలో 1854 నుండి 1918 వరకూ నివశించారు. తత్వవిచారం, సిద్థాంతం, దర్శనం ప్రచారం చేయలేదు కానీ, వారి మాటలు, సంభాషణలు, సలహాలు, సూచనలు ప్రజలకు మార్గాన్ని చూపారుు. ధన్యులయ్యారు శిర్డీ ప్రజలు. పేద గొప్ప అన్న బేధం లేకుండా బాబాని ఏకాగ్రతతో తలచుకున్న వారున్నారు. అలాగే పెద్దలు, పిన్నలు, రోగులు, అసహాయులు కూడా ఆయన్ని ఆశ్రరుుంచిన వారే.
సాయిబాబాకు ప్రాపంచిక కోరికలు లేవు. నిత్యం సతమతమవుతున్న మానవత్వ పరిరక్షణే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇతరుల మేలు కోసమే జీవించారు. అన్ని మతాలవారూ తమ తమ ఇష్టదైవాల్ని ఈయనలోనే చూడగలిగారు. అందుకే ప్రతి మతస్తులకూ ఈయన తనవాడిలాగే దర్శనం ఇచ్చారు. యత్భావం తద్భవతి అన్న చందంగా ఎవరు కోరిన విధంగా వారిని అలాగే అనుగ్రహించారు.ఈయన మీద నమ్మకం లేనివారు కూడా ఒక్కసారి ఈయన దర్శనం చేయగానే పాదాల మీద పడి నమస్కరించారు. అనేక పుణ్యక్షేత్రాలూ, పుణ్యనదీ ప్రవాహాలు, సకల దేవతా స్వరూపాలు ఈయనలోనే చూసి ఆబాలగోపాలం తరించారు.
సాయి తత్వం
శిర్డీ సాయిబాబా వారు కూడా ప్రేమతత్వాన్నే ఎక్కువగా కనబరిచారు. శ్రద్ధ, సాబురి- ఓర్పు, సహనంతో జీవితాన్ని సాగించారు. సాటివారి పట్ల విసుగు, చిరాకు, కోపం, ద్వేషం వంటివి ప్రదర్శించకుండా, సహాయ సహకారాలు అందించడమే పరమావధిగా ఆయన అనుసరించి, మనకి ఆదర్శంగా నిలిచారు. కేవలం మానవులనే కాకుండా కుక్కలు, గుర్రాలు వంటి జంతుజాలాల్లో కూడా భగవంతుని వీక్షించి, వాటిని కూడా ప్రేమగా చేరదీస్తూ ఆహారం అందించేవారు. షిర్డీ గ్రామంలో ఆయన నివశించిన ద్వారకామాయిని ఫకీర్లు, స్వాములు, సాధువులు,మునిపుంగవులు, ఖలందర్లు, జాగీర్దార్లు, కూలీలు, ముస్లింలు, క్రిష్టియన్లు, హిందువులు, తత్వవేత్తలు, భాషాభిమానులు ఇలా ఆ గడపని మొక్కని వారంటూ ఎవరూ లేరు. కుల, మత, భాషా, ప్రాంతీయ తత్వాలు లేకుండా అశేష ప్రజలు ఆయన దర్శనంకోసం బారులు తీరి దర్శించుకునే వారు. బాబా స్వయంగా వండిన ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టేవారు.
సహపంతి భోజనానికే ఎంతో ప్రాధాన్యత నిచ్చేవారు. ఇంటింటికీ తిరిగి తిరిపెమెత్తి వారిచ్చిన దానం స్వీకరించి వారిని తన యోగసాధనతో పాపవిముక్తుల్ని చేసేవారు. అయినా మూర్ఖజనులు పెట్టిన కొన్ని పరీక్షలు కూడా ఎదుర్కొని వారికి జ్ఞానోదయాన్ని కలిగించిన మహాయోగిరాజు షిర్డీ సాయి.
ఆయన శిష్యరికం చేయాలని ఎంతమందో ముందుకు వచ్చారు. సాయిబాబాని కొందరైతే ప్రత్యక్షంగానే అడినవారున్నారు. అందుకు ఆయన నోటివెంట ఒకే మాట వచ్చేది. అందరికీ గురువు ఆ పరమేశ్వరుడే. ‘సబ్‌ కా మాలిక్‌ ఏక్‌’ ఇదే ఆయన సిద్ధాంతం. ‘అల్లా అచ్చా కరేగా’ అన్నదే ఆయన విశ్వాసం. అందరినీ అలాగే ఆశీర్వదించేవారు. అయినప్పటికీ ఆయన తన వద్దకు వచ్చిన వారి మీద కురిపించే ప్రేమ, దయ, కటాక్షం, కరుణ అవ్యాజమైనవి, అద్వితీయమైనవి.
బాబా సొంత ఆస్తులు
షిర్డీ సాయిబాబా జీవించినంత కాలం వారికి స్వంతం అంటూ ఏమీలేదు. కేవలం ఒక జుబ్బా, కఫనీ, సట్కా, తంబరి మాత్రమే వారి వెంట ఉంచుకునేవారు. ఇతర ఎటువంటి సంపదలూ ఆయన ఆశించనూలేదు. ఆయనకు లేవు కూడా. ఎందరో భక్తులు కానుకలుగా పైకం కూడా ఇచ్చేవారు. దానిని వారు అత్యంత ప్రేమతో భక్తులకు దక్షిణగా ఇచ్చేసేవారు. ఒక పైసా కూడా ఆయన వద్ద ఉంచుకునే వారు కాదు.శిర్డీ గ్రామంలో సాయిబాబా నివశించే చోట ఖాళీ స్థలంలో మొక్కలు నాటేవారు. లెండీబావి నుంచి స్వయంగా నీళ్ళుతోడి ఆమొక్కలకు పోసేవారు. నేటికీ భక్తులు ఆ మొక్కలు పెంచిన స్థలాన్ని అక్కడ ఏర్పరచిన పార్కునీ ఇప్పటీకీ చూడవచ్చు. ఆయన ఎక్కడకు వెళ్ళాలన్నా కాలినడకనే ప్రయాణించారు తప్ప ఏ వాహనాన్నీ ఎక్కి వెళ్ళలేదు. చదువు రాని వానివలే కనిపించే బాబాకి భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ కరతలామలకాలు అంటే ఆయన ఎంతటి జ్ఞాన సంపన్నుడో అర్ధం చేసుకోవచ్చు. నిత్యం అనేక మంది మనుషుల మధ్యలో ఉంటూనే లౌకిక ప్రపంచ బంధాలకు అతీతంగా ఉండేవారు.
మనలో మనవాడిగా ఉంటూనే అందరికీ భగవంతుడిగా గోచరమయ్యే ఒక అద్వితీయ స్వరూపుడు సాయిబాబా. వారు ఉన్నంతకాలం భిక్షాటన మీదే జీవితాన్ని సాగించారు తప్ప రేపు ఎలాగా అనేది ఏనాడూ పట్టించుకోలేదు. అదీకాక నేడు ఆయనకు భక్తులు చేస్తున్న సేవలు కూడా ఆ రోజుల్లో ఆయన ఏనాడూ ఎవరిచేతా చేయించుకోలేదు. కానీ, బాబాగారికి హారతి అంటే ఇష్టం. దీపాలు వెలింగించడం అన్నా ఎంతో ప్రీతి. ఇందుకు కూడా కారణం లేకపోలేదు. దీపం జ్ఞానానికి ప్రతీక. ఎల్లప్పుడూ ఆయన దీపాలు వెలిగించడం అంటే జ్ఞానజ్యోతుల్ని ప్రకాశింపచేయడమే అందుకు నిదర్శనం.
బాబా ప్రసంగాలు
ఆయన ప్రసంగాలు, వాక్కులు, సంభాషణలు జాగ్రత్తగా పరిశీలిస్తే, వాటిలో దేశ పురోభివృద్ధికి దోహద పడే అంశాలు చాలా వరకూ చోటుచేసుకుంటాయి. ప్రజాస్వామ్యం, పరమత సహనం, సమానత్వం, శాంతి స్థాపన వంటి ఆశయాలు కనిపిస్తాయి. సహనంతో మనుగడ సాగించమని బోధించిన సద్గురువు శ్రీషిర్డీసాయిబాబా. ఈ సచ్ఛితానంద స్వరూపుని తత్వాలు భక్తులే కాకుండా దేశప్రజలందరూ ఆకళింపుచేసుకుని ఆచరించిననాడు దేశ క్లిష్టపరిస్థితులు రూపమాసిపోతాయన డంలో ఎంతమాత్రం సందేహం లేదు. సహనంతో, సామరస్యంతో, సమానత్వంతో, శాంతితో ఏ సమస్యనైనా పరిష్కంచవచ్చు అన్నదే షిర్డివాసుని తత్వబోధ. ఈ మాట నిజమే కదా! ఆచరణ యోగ్యమే కదా! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా అశేష భక్తులకు దర్శనమిచ్చిన ఆ యోగిరాజు, అందరికీ రాజాధిరాజు, సచ్ఛితానంద సద్గురువు సాయినాధుడే.

0 comments:

Post a Comment