Sunday, July 28, 2013

"సబ్ కా మాలిక్ ఏక్ హై"

సబ్ కా మాలిక్ ఏక్ హై

అనేక మతాలూ వేద వేదాంగాలు చదివినా కూడా కానరాని ఆత్మసాక్షాత్కారం ఒక్క సద్గురువు వలన నీకు ప్రాప్తించి నిన్ను భగవంతునికి దగ్గర చేస్తుంది. షిర్డీ సాయి, సత్య సాయి ,గురునానక్ ,ఏసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త , గౌతమ్ బుద్దుడు , మహా వీరుడు ఇలా అనేకమంది సద్గురువులు మనిషిని తమ బోదనల ద్వారా ప్రభావితం చేసారు . త్రేతా యుగంలో అయితే శ్రీరాముడు ద్వాపరంలో శ్రీకృష్ణుడు వీరందరూ భగవంతిని అంశతో అవతరించారు ఒక్కొక్క అవతారానికి ఒక్కో కారణం . అందుకే ఏ దేవున్ని చూసినా యోగముద్రలో వున్నట్టు మనకు కనిపిస్తుంది . ఏ గురువు కూడా నేనే భగవంతున్ని అని చెప్పలేదు , రాముడు శివున్ని పూజించాడు , యేసుక్రీస్తు కూడా నేను దేవుని కుమారున్నే అంటాడు . "ఎప్పుడైతే దర్మానికి కీడు వాటిల్లి అధర్మం ప్రబలుతుందో ఆయా కాలాల్లో అవతరిస్తాను" అని గీతలో భగవానుడు శ్రీకృష్ణుని రూపంలో అర్జునునికి ఉపదేశించినట్లు ప్రతి సద్గురువు పుట్టిన కాలమాన పరిస్తితులను గమనించినట్లైతే వారు అయాకాలల్లో ఉన్న సమస్యలను పరిస్కరించటానికే అవతరించినట్టు మనకు కనపడుతుంది. ముఖ్యంగా షిర్డీ సాయి ఆ రోజుల్లో మతకల్లోలలతో అట్టుడికి పోతున్న హిందూ ముస్లింలలో స్నేహ భావాన్ని పెంపోదించి , తద్వారా మానవతావాదాన్ని చాటి చెప్పారు , హిందువులు హిందుగా, ముస్లింలు ముస్లిం గా సాయి నాదున్ని కొలుస్తారు . భగవంతుడు ఒక్కడే అని "సబ్ కా మాలిక్ ఏక్ హై" అని చాటి చెప్పారు . అంతే కాకుండా తన భక్తులకు అనుక్షణం కనిపెట్టుకొని ఉండెడివారు. వారు తన వద్ద రాత్రి పూట అలసినిద్రిస్తున్న భక్తులకు ప్రతిగా తన స్వహస్తాలతో సేవ చేసేవారట . వారు సర్వజ్ఞాని అయినా కూడా ఏమి తెలియనట్టే నటించేవారు వారు భోగాలు అనుభవించకుండా భిక్ష చేసుకొని జీవించారు. దక్షనల రూపంలో భక్తులు సమర్పించిన వేలాది రూపాయిలను పేదలకు దానం చేసేవారు . వారు తనువు చాలించే నాటికీ బాబా దగ్గర కేవలం ఏడు రూపాయిలు మాత్రామే వున్నాయట .

ఈ గురువులందరూ ఒకేసారి ఆకాశం నుండి ఊడి పడలేదు ఎంతో కఠిన పరీక్షలను తట్టుకొని తమ తపో జ్ఞానంతో భగవంతున్ని ప్రసన్నం చేసుకొని సద్గురువులుగా ఖ్యాతి పొందారు . వారు మానవులే మనము మానవులమే అందరిలోనూ దేవుడున్నాడు మరి వారెందుకు మహానీయులయ్యారు ? వారు నిద్రాహారాలు మాని అనుక్షణం వారిలోవున్న భగవంతుని ఉనికి కోసం తపించి సాదించి ఆత్మసాక్షాత్కారం పొందారు. తద్వారా మహనీయులు , మార్గదర్శకులు అయ్యారు. వీరందరివి దారులు వేరైనా గమ్యం ఒక్కటే అదే భగవంతునికి దగ్గర కావటం అనగా మన జన్మ సార్ధకతను తెలుసుకోవటం , మనల్ని మనం తెలుసుకోవటం మంచిని పెంచిపోషించి చెడుని ఖండించటం ఏ మతములోని భక్తిభావన అయినా మంచే చెప్తుంది . "ఒక దర్మం తప్పిన భక్తునికంటే దర్మం తప్పని నాస్తికుడే భగవంతునికి ఇష్టమట " .

అది తెలుసుకోలేక కొంతమంది మూడ భక్తితో మూడ విశ్వాసాలతో , మత విద్వేసాలతో ఎదుటవారి ఆచార వ్యవహారాలను కించపరుస్తూ అజ్ఞానమనే వూభిలోకి కూరుకుపోతున్నారు. అంతే కాకుండా తమ స్వార్ధం తో మతవిద్వేసాలను రెచ్చగొడుతున్నారు , బలవంతపు మతమార్పిడులు చేస్తున్నారు. ఈ మతవిద్వేసాలను రెచ్చగొట్టటం అనేది ఏ ఒక్క మతానికి అంటగట్టినా పొరబడినట్టే . ఈ అనర్దాలకి తోడు దొంగ గురువులు ,స్వామీజీలు భక్తుల బలహీనతలతో ఆడుకుంటున్నారు . వారి లీలని కళ్ళార వీక్షించి కూడా వారినే మూడ భక్తితో మూర్ఖంగా కొలుస్తున్నారు కొంతమంది జనాలు. వారిని మన చట్టాలు ఏమి చెయ్యలేవు ఒకవేలా చేసినా ఏనుగు చచ్చినా బ్రతికినా ఒక్కటే అన్నట్టు వుంటుంది .

చివరిగా: నావికుని గమ్యం చేరటానికి దీపపు స్తంభం ఎంత అవసరమో మన జన్మ రహస్యం తెలుసుకొని మన లక్ష్యాలను చేరుకోవటానికి కూడా ఒక సద్గురువు అవసరం ఎంతైనా వుంటుంది అంతేకాని దానికి మతము అను ముసుగు వేయరాదు ఏ దేవుడు ఇతర మతాల వారిని పిల్లాపాప అనికూడా చూడకుండా ఊచకోత కోయమని చెప్పలేదు ఏ ప్రవక్తా ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి అమాయికుల ప్రాణాల్ని తియ్యమని చెప్పలేదు యే దేవుడు ఇతర మతాల వారిని కించపరచి మతమార్పిడులు చెయ్యమని చెప్పలేదు . మనం ఒక సన్మార్గం లో వెళ్ళటానికి మాత్రామే మతమనేది ఉపయోగపడాలి .

"సబ్ కా మాలిక్ ఏక్ హై" అన్న సాయినాదునితో పాటు "సర్వమతాల సారం ఒకటే " అని బోదించిన ప్రతి సద్గురువుకి జోహార్లు.

No comments:

Post a Comment