బాబా ప్రతిరోజు నూనె తెచ్చుకునే డబ్బాలో నీళ్లును పోసి బాగా కలియత్రిప్పి ఆనీటిని నోటిలోకి తీసుకుని పుక్కిలించి తిరిగి ఆ డబ్బాలోకి పోశారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించారు. రాత్రంతా అవి జ్ఞానప్రకాశాలను విరజిమ్మాయి. ఇదంతా చూసిన వ్యాపారుల కళ్లకు అజ్ఞానపు చీకట్లు ఆ వెలుగులో తొలగిపోయాయి. క్షమించమంటూ బాబా కాళ్ళపై పడ్డారు. అబద్దాలు ఆడవద్దని, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకవలెనని చెప్పి బాబా వారిని పంపించారు.
నిజానికి సూర్యాచంద్రులనే ఆకాశ దీపాలుగా నిలిపిన మహిమాన్వితుడికి నూనె దీపాలు వెలిగించటం ఓ లెక్కా? బాబా దీపాలు వెలిగించాలంటే నూనె అక్కర్లేదు. సంకల్పం చాలు. కానీ, మానవావతారంలో నడిచిన దైవం బాబా. అందుకే మామూలు మనిషిలా నటించి ఎలా బతుకుతాడో జీవించి చూపారు.
బాబా భక్తుల్ని సన్మార్గంలో పెట్టటానికి, వారి పాపాలు, కర్మల్ని ధ్వంసం చేసి మానవజన్మను చరితార్థం చేయడానికి అవతరించిన దివ్య పురుషుడు. మనం భగవంతునికి భక్తితో పాటు ప్రేమను కూడా అర్పించాలి. నిజానికి మనం అడగదల్చుకున్నవన్నీ గ్రహించి కోరకుండానే అనుగ్రహించి భగవంతుడికి మనం అర్పించుకునేది పరిపూర్ణ భక్తిని మాత్రమే. దానిని శ్రద్ధ, విశ్వాసాలతో పాటించటం ముఖ్యం.
ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్